కర్నూలు బ్యూరో : ఇంటర్ పరీక్షల ఫలితాల్లో కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని కర్నూలు టౌన్ మోడల్ కు చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని బండి పావని ఎంపీసీ గ్రూపులో 1000 కి 986 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోనే టాపర్ గా నిలిచారు.
అలాగే ఒకేషనల్ కోర్సులో ఇదే కళాశాలకు చెందిన వి.తేజస్విని 1000 / 986 మార్కులతో ఉత్తీర్ణత సాధించి టాపర్ గా నిలిచారు. ఇక ఇదే కళాశాలకు చెందిన జోష్ణ ఎంపీసీలో 975, లక్ష్మీ లలితా రాణి ఎంపీసీ గ్రూపులో 977, బైపీసీలో డి.నందిని 980, రేణు విజయ 978, కామర్స్ గ్రూపులో జే.కళ్యాణ్ 901, సుజాత 851 ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణులయ్యారు.. వీరిని కర్నూల్ ఆర్ఐఓ ఎస్ వి ఎస్ గురువయ్య శెట్టి, కర్నూల్ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి.సుంకన్న, లెక్చ్యులర్స్ సురేష్ చంద్ర, శ్రీకాంత్, రహిమాన్, శ్రీనివాసులు, రాజు నాయక్, తదితరులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
జిల్లా టాపర్ గా ఆటోవాలా కుమార్తె..
ఇంటర్ ఫలితాల్లో కర్నూల్ నగరంలోని కల్లూరు చెందిన బండి పావని 1000 / 986 మార్కులతో జిల్లాలోని టాపర్ గా నిలిచారు. ఎంపీసీ గ్రూప్ లో ఆమె ఈ ఫలితాలను సాధించగలిగారు.. నిరుపేద కుటుంబంలో జన్మించిన బండి పావని తండ్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం లేవగానే ఆటో నడుపుకుంటే తప్ప అతని కుటుంబం గడిచేది కాదు. అయితే ఎంత కడుపేదరికంలో ఉన్నా తనకున్న ఇద్దరు కుమార్తెలను బాగా చదివిస్తూ వచ్చాడు. ఒకటి నుంచి పదవ తరగతి వరకు పిల్లలను ప్రభుత్వ బడిలోనే పావని తల్లిదండ్రులు చదివిస్తూ వచ్చారు. ఈక్రమంలోనే పావని అక్క 10, ఇంటర్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం బీటెక్ విద్యను అభ్యసిస్తున్నారు. చిన్నతనం నుంచి విద్యలో అక్క కనబరుస్తున్న ప్రతిభను ఆదర్శంగా తీసుకున్న పావని కూడా 10 ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకుని కర్నూల్ టౌన్ మోడల్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తూ వచ్చారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన పావని ద్వితీయ సంవత్సరంలో కూడా అదే స్థాయిలో మంచి మార్కులు సాధించి జిల్లాలోని ఉత్తమ విద్యార్థినిగా నిలిచారు. 1000 కి 986 మార్కులు సాధించడం గమనార్హం. పెద్ద కుమార్తె కన్నా చిన్న కుమార్తె చదువులో మరింత రాణించి ఏకంగా జిల్లా స్థాయిలోనే టాప్ గా నిలవడం ఆటోవాలా అయినా బండి పావని తల్లిదండ్రులకు ఆనందం కలిగించింది. తమ పెద్ద కుమార్తె వల్లే చిన్న కుమార్తె కూడా ఇంటర్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి తమ పేరును రాష్ట్రస్థాయిలో నిలిపినందుకు వారి కళ్ళలో ఆనందభాష్పాలు చెమ్మరించాయి.. తమ కూతురు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందమే కారణం అంటూ పావని తల్లిదండ్రులు మెచ్చుకున్నారు.. లక్షలు పోసి ప్రైవేటు స్కూలు, కాలేజీలోనే కాదు.. మంచి బోధన, సత్ప్రవర్తన ఉంటే గవర్నమెంట్ కాలేజీలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చుని.. ఇందుకు తమ కూతురే ఉదాహరణ అంటూ.. పావని తల్లిదండ్రులు కితాబు ఇవ్వడం గమనార్హం.