.ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) ఇంద్ర గిర్రులపై కొలువైయున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన శ్రీ విశ్వాసు నామ సంవత్సర చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈనెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కళ్యాణ మహోత్సవాలను ఆరు రోజులపాటు నిర్వహించగా చివరి రోజు ఆదివారం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి.
చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజలను ప్రత్యేక అర్చన లను నిర్వహించారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం నగర వీధుల్లో వాహన సేవలో భాగంగా నంది, రావణాసుర, వెండి పల్లకి వంటి వాహనాల్లో ఆదిదంపతులు విహరించి భక్తులను కనువిందు చేశారు. ఒకవైపు వెండి వాహనంపై స్వామివారి అమ్మవారు ఆశీనులై ఉండగా మహిళల పసుపు నేలతో శుద్ధి చేసి హారతులు కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాల మధ్య సాంప్రదాయ కలలైన తప్పెట్లు కోలాట ముత్యాలు తాళం భజన పలు కళాకారుల ప్రదర్శనలు ముందు సాగుతుండగా వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ప్రతిరోజు పల్లకి రథోత్సవ సేవను నిర్వహించారు.
అలాగే ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారికి అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. వధూవరులైన శ్రీ దుర్గా మల్లేశ్వరుల గొప్పతనం గురించి ప్రముఖ కవులు పండితులు వివరించడంతోపాటు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వరుని దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
పూర్ణాహుతితో ముగిసిన బ్రహ్మోత్సవాలు..
చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించిన పూర్ణాహుతితో ముగిసాయి. ఆలయంలోని యాగశాలలో ఆదివారం నిర్వహించిన పూర్ణహుతి కార్యక్రమంలో దేవాదిశాఖ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కే రామచంద్ర మోహన్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
శాస్త్ర ప్రకారం… ధాన్య కొట్నోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి అవభృత స్నానం( పవిత్ర కృష్ణానది లో)కోసం గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులను అర్చకులు, వేద పండితులు ఊరేగింపు గా ఆలయ స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో కృష్ణానదికి తీసుకువెళ్లి, పుణ్యనదిలో అవభృత స్నానకార్యక్రమం నిర్వహించారు. ఆరు రోజులపాటు నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.