హైదరాబాద్ – సీఎం అంటే బాస్ కాదు ప్రజా సేవకుడని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. అర్థరాత్రి బుల్డోజర్లతో ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పారు.
విద్యార్థులను మంత్రులు చులకనగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీకి 14 వేల ఎకరాలు ఉండగా హైదరాబాద్లో ఉన్న భూమిని ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హెచ్సీయూలో వన్యప్రాణులు లేవని ఎలా చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నేడు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలపై ఇదే మా కమిట్మెంట్ అని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చాక అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎవరైనా ఆ భూములు కొంటే మళ్లీ వెనక్కి తీసుకుంటామని తేల్చిచెప్పారు. అద్భుతమైన పార్క్గా మార్చి హెచ్సీయూకి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్ ఆలోచన అని విమర్శించారు. హెచ్సీయూ భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములంటే ప్రజలవి.. సీఎం ధర్మకర్త మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిందిపోయి..ప్రభుత్వ పెద్దలు ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు.