FASTag annual pass ఇదో గేమ్ ఛేంజ‌ర్ : ప‌వ‌న్ క‌ల్యాణ్

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ వ్యవస్థ పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ఈ కీలక ప్రకటనను ఆయన స్వాగతించారు. ప్రయాణికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ పాస్ విధానం రహదారి ప్రయాణాల్లో గణనీయమైన మార్పు తీసుకురాబోతుందంటూ పవన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందించారు.

రూ.3000తో సంవత్సరం పొడవునా ప్రయాణ సౌలభ్యం

పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొంటూ, ఈ పాస్ వ్యవస్థ టోల్ చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, వాహనదారులకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వ్యక్తులకు ఇది సమయ, ధన వ్యయాన్ని తగ్గించనుందని పేర్కొన్నారు.

కేంద్రానికి కృతజ్ఞతలు – ఇది ప్రజాపాలనకు నిదర్శనం

ఈ నిర్ణయంతో ప్రయాణికుల డిమాండ్‌కు సరైన పరిష్కారం లభించిందని పవన్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా సున్నితమైన, వేగవంతమైన, ఎలాంటి వివాదాలకు తావులేని విధంగా హైవే ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజాపాలన పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇది ప్రతీక అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

మార్గదర్శకాలు ఇంకా విడుదల కావలసిన పరిస్థితి

ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్‌లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పాస్‌ ద్వారా దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాల్లో మరింత వినూత్నత, వేగం, సౌలభ్యత తీసుకురావడం లక్ష్యంగా ఉందని గడ్కరీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి కార్లు, జీపులు, వాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తించేలా ఈ పాస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, నిబంధనలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Leave a Reply