వరదలు రాకముందే బయటపడ్డ జూరాల లోపం
9, 12వ గేట్లకున్న రోప్లు తెగిపోయిన వైనం
పాలమూరుతో పాటు అదనంగా లక్షల ఎకరాలను సాగునీరు
హైదరాబాద్కూ కొనసాగుతున్న తాగునీటి పంపింగ్
అప్రమత్తమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రిపేర్లు షురూ
మంజీరా ప్రాజెక్టులోనూ కనిపించిన సమస్యలు
ఫుల్ ట్యాంక్ లెవల్ నీటి నిల్వ చేయొద్దన్న నిపుణులు
హైదరాబాద్ మహానగరానికి అతిపెదద్ద తాగునీటి వనరు
తుంగభద్ర ప్రాజెక్టులోనూ ఇదే తరహా సమస్య
గత ఏడాది కొట్టుకుపోయిన 19వ నెంబర్ గేట్
ఏడాది అయిపోతున్నా పట్టించుకోని అధికారులు
శ్రీశైలం ప్రాజెక్టుకూ పొంచి ఉన్న భారీ ముప్పు
ప్లంజ్ పూల్ సమస్యతో అనేక ఇబ్బందులు
స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఎంత ఖర్చైనా రిపేర్లు చేయించాల్సిదేనని వెల్లడి
తెలంగాణ సర్కారు తీరుపై నిపుణుల పెదవి విరుపు
ప్రాజెక్టుల నిర్వహణపై ఫోకస్ పెట్టాలని రిక్వెస్ట్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
కృష్ణా నదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఈ ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలే అయినా.. ఏటా దాదాపు వెయ్యి టీఎంసీల వరద ఈ ప్రాజెక్టు గేట్లు దాటి దిగువకు వెళ్తుంది. కృష్ణా నదికి ఏ చిన్న వరద వచ్చినా ఈ డ్యామ్ త్వరగా నిండుతుంది. వరద తాకిడి నుంచి కాపాడుకోవాలంటే అన్ని గేట్లను ఎత్తాల్సిందే. మిగితా ప్రాజెక్టులతో పోలిస్తే గేట్లు ఎత్తడం, మూసేయడం జూరాలలో చాలా కామన్. అదే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఎప్పుడోగానీ గేట్లు ఎత్తే పరిస్థితి ఉంటుంది. జూరాలలో మాత్రం అలా కాదు. ఇంతటి కీలకమైన ఈ ప్రాజెక్ట్ నిర్వహణ ఎలా ఉండాలి? గేట్ల విషయంలో ఎంత పకడ్బందీగా.. ఎంత ముందు జాగ్రత్తతో ప్రభుత్వాలు వ్యవహరించాలనేది డ్యామేజీ బయటపడడంతో చర్చకు వస్తోంది. దీంతోపాటు తెలంగాణకు ప్రాధాన జలవనరులుగా ఉన్న తుంగభద్ర, శ్రీశైలం, మంజీరా వంటి ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభత్వం ఫోకస్ పెట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఊహించని విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందని జలవనరుల రంగ నిపుణులు అంటున్నారు.
నీళ్లు నిండినప్పుడే గుర్తొస్తే ఎట్లా..
జూరాలపై గేట్లు తెరవడానికి, మూయడానికి గ్యాంటీ క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ క్రేన్ను నడిపించే కరెంట్ మోటార్కు అంత కెపాసిటీ లేదన్నది అధికారుల వాదన. క్రేన్ ట్రాక్ కూడా సరిగా లేక మోటార్ పైనే లోడ్ పడుతోంది. నాలుగురోజులకోసారి ఇది కాలిపోతున్నట్టు తెలుస్తోంది. ఇది జూరాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. నీళ్లు నిండినప్పుడే చాలామందికి ప్రాజెక్టులు గుర్తుకొస్తాయి. చూసేందుకు జనాలు వెళ్తారు. కానీ, ఇరిగేషన్ శాఖకు నీళ్లున్నా లేకపోయినా నిర్వహణ మాత్రం చూసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు చేయాల్సిన మెయింటెనెన్స్పై ఫోకస్ పెట్టాలి. కానీ, జూరాలలో అది జరగడం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల బలోపేతం వంటి రిపేర్ల కోసం 2022లో అప్పటి ప్రభుత్వం ₹11 కోట్లు విడుదల చేసింది. అయితే.. అప్పటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తయినట్టు సమాచారం. అధికారుల నిర్లక్ష్యమే పనులు పూర్తికాకపోవడానికి కారణమన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.
9, 12వ నెంబర్ గేట్ల రోప్లు తెగిపోయాయా?
పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ఉన్న జూరాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నది పరిస్థితులను గమనిస్తే అర్థం అవుతోంది. వలసల జిల్లాకు వరప్రదాయనిగా ఉంటూనే.. పరోక్షంగా 7లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లందిస్తున్న జూరాల రిపేర్లు ఏళ్లతరబడి అలాగే ఉండిపోయాయి. ఇప్పుడది పూర్తిగా దెబ్బతినడంతో 9వ, 12వ నెంబర్ గేట్ల రోప్లు తెగిపోయాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా రిపేర్లలో భాగమే అని ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లు ఉన్నాయి. రబ్బర్ సీల్స్ ఊడి లీకేజీలు జరగడం, గ్రీసింగ్ లేకపోవడంతో రోప్లు తుప్పు పట్టడం, ఏటా పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేకపోవడం వంటి కారణాలతో క్రస్ట్ గేట్లకు రెగ్యులర్గా రిపేర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.
గేట్లకు తుప్పు.. 2019లో లోపం బయటకు..
ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టిన విషయం 2019లోనే వెలుగులోకి వచ్చింది. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు కూడా అయ్యాయి. 2021లో లీకేజీలు పెద్ద ఎత్తున కనిపించాయి. రిపేర్ల కోసం 19 కోట్లతో 2018లో ప్రతిపాదనలు పెట్టారు. 2019, 2020లోనూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినా నిధులు కేటాయించలేదని సమాచారం. ప్రస్తుతం ఎనిమిది గేట్ల ఇనుప రోప్లు, 18 గేట్ల రబ్బర్ సీళ్లు దెబ్బతినడంతో లీకేజీలు మరింత కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు చరిత్రలో అన్ని గేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో రిపేర్లు చేసేందుకు 2022లో 11 కోట్లు రిలీజ్ చేసినా ఆ పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది.
జూరాల గేట్లు ఎత్తడంతో రోప్ల వ్యవహారం వైరల్
ఈ మధ్య 98 వేల క్యూసెక్కుల నీరు జూరాల రాగా 12 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. అదే సమయంలో ఈ రోప్ల వ్యవహారం బయటపడింది. 2009 మాదిరిగానే జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టును 1995లో 550 కోట్ల రూపాయలతో నిర్మించారు. దీని పొడవు కిలోమీటర్. మొత్తం రాతికట్టడమే. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులతో నిర్మాణం చేశారు. జూరాలకున్న మరో సమస్య ఏంటంటే.. ఈ వంతెన మీదుగా భారీ వెహికిల్స్ తిరుగుతుంటాయి. ఆనకట్ట సేఫ్టీ కోసం వాహనాలు తిరిగేందుకు మరో బ్రిడ్జి నిర్మించాలని ఎన్డీఎస్ఏ నిపుణులు గతేడాది సూచించారు.
మంజీర, శ్రీశైలం, తుంగభద్ర అన్నింటా..
మంజీర, శ్రీశైలం, తుంగభద్ర అన్ని ప్రాజెక్టుల్లోనూ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ) ఇటీవల అన్ని ప్రాజెక్టులను విజిట్ చేసి పూర్తిస్థాయిలో రిపోర్ట్స్ అందజేసినట్టు తెలుస్తోంది. అయితే.. వెంటనే చేపట్టాల్సిన పనులపై కూడా అధికారులు అలర్ట్ చేశారు. నిజానికి ప్రాజెక్టుల ఇంజినీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లు ఇవన్నీ చూసుకోవాలి. ప్రభుత్వాలకు సమస్య వివరించి నిధులు తెచ్చుకోవాలి. కానీ, డ్యాములు నిండినప్పుడే, గేట్లు తెరిచేటప్పుడే ఇరిగేషన్ శాఖ కళ్లు తెరుస్తామంటే కుదురుతుందా అన్న వాదన కూడా వినిపిస్తోంది. పైగా ప్రాజెక్టుల రిపేర్లు అంటే ఒకటి రెండు రోజుల్లో అయ్యే పనికాదని అందరికీ తెలిసిందే.
ముప్పు అంచున మంజీరా..
హైదరాబాద్ జంటనగరాలతో సమీప గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా ప్రాజెక్టు కూడా ముప్పు అంచున ఉందన్న విషయం తెలుస్తోంది. ఈ బ్యారేజీకి వెంటనే రిపేర్లు చేయకపోతే ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వ ఏ మాత్రం సేఫ్ కాదని ఎస్డీఎస్వో (స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్) చెబుతోంది. మార్చి 22వ తేదీన బ్యారేజీని పరిశీలించిన అధికారుల బృందం దీనిపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పియర్లకు పగుళ్లు వచ్చాయని గుర్తించింది. తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో మట్టికట్ట బలహీనమైందని, ఏళ్ల తరబడి రిపేర్లు చేయకపోవడంతో గేట్లు, స్పిల్ వేలోని కొంత భాగం దెబ్బతిందనే విషయాన్ని స్పష్టం చేసింది. రోజూ 10 కోట్ల గ్యాలన్ల నీరు అందించే ఈ బ్యారేజీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నిర్వహణలో ఉంది. నీళ్లు తరలించుకు వెళ్లడమే గానీ.. దీన్ని మంచి, చెడ్డలను అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
శ్రీశైలం డ్యామ్లో ప్లంజ్ పూల్ సమస్య
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల వరద కంటిన్యూ అవుతోంది. క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. అయితే మంచిదే కదా అనుకుంటున్నారా. కానీ, శ్రీశైలం డ్యామ్లోనూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్లంజ్ పూల్ సమస్య తీరలేదు. ఈ వానాకాలం సీజన్ను డ్యామ్ ఎట్లా తట్టుకుంటుందో అనే ప్రశ్న అధికారుల నుంచి ఎదురవుతోంది. రిపేర్ల కోసం చేసిన స్టడీస్లో ఆందోళనకర విషయాలు బయటికొచ్చాయి. డ్యామ్ వద్ద అంచనాలకు మించిన నష్టం జరిగినట్లు పరిశీలకులు గుర్తించారు. దెబ్బతిన్న భాగాలు ఎక్కువగా నీటిలోపల ఉండటంతో వాటి ఎఫెక్ట్ అంతగా బయటకు కనిపించడం లేదు. డ్యామ్ ముందు ఫ్లంజ్ పూల్ 143 అడుగుల లోతు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం డ్యామ్ రిపేర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు స్పష్టం చేశారు.
తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటు..
తుంగభద్ర డ్యామ్లో వరద తాకిడికి గతేడాది ఓ గేటు కొట్టుకుపోయింది. గత ఆగస్టులో డ్యామ్కు చెందిన 19వ గేటు కొట్టుకుపోయింది. వెంటనే ఎపి ప్రభుత్వం అప్రమత్తమై దాన్ని రిపేర్లు చేసింది. గేట్ ను సరిచేసింది. కాగా, జలాశయంలో నీటిమట్టం 41టీఎంసీలు చేరేలోగానే గేటు బిగించాల్సి ఉంది. కానీ, తుంగభద్ర డ్యాంలో 34 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి సుమారు వరద వచ్చి చేరుతోంది. దీంతో 41 టీఎంసీలు దాటిపోతాయి. ఆ టైంలో గేటు ఫిట్టింగ్ డేంజర్ అని పనులు ఆపేశారు. 19వ గేట్ స్థానంలో అప్పుడే స్టాప్లాగ్లను ఏర్పాటు చేశారు. నీరు దిగువకు వెళ్లకుండా చర్యలైతే తీసుకున్నారు. కానీ ఇది తాత్కాలికమే కదా. పర్మినెంట్ పనులు చేద్దామంటే మ్యాటర్ ముందుకు కదలడం లేదు.