జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీనితో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కాల్పులు జరిపారు.
ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకుని ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానించి గాలింపు చర్యలు చేపట్టాయి . ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు ప్రారంభం కావడంతో భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి.. దీంతో ఇద్దరు కూడా హతమైనట్లు అధికారులు ప్రకటించారు.. మరణించిన ముగ్గురు తీవ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారని వెల్లడించారు.