Devotional Tour | సోలమలై మురుగన్ ఆలయంలో పవన్ సేవలు….
చెన్నై – తమిళనాడులోని షష్టి తీర్థ ఆలయాల సందర్శన పర్యటనలో ఉన్న ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి ఉదయం తమిళనాడులోని పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు . ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆయనకు స్వామి వారి ఫోటో, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం, వస్త్రాలు అందించి సత్కరించారు.. ఆయన వెంటన కుమారుడు అకిరా నందన్, టిటిడి పాలకమండలి సభ్యుడు అనంద్ సాయి ఉన్నారు..
కాగా, ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా నిన్న పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో, ఉచ్చికాల పూజలో పాల్గొన్నారు. కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ కి ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. దానిని మహా ప్రసాదంగా ఉప ముఖ్యమంత్రివర్యులు స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వెలుపల పవన్ మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీ పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడం పై దృష్టి పెడతాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియచేస్తాను. అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తాను. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాను. అలాగే పళని నుంచి కూడా తిరుమలకు తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతాం. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలనే తలంపుతో ఇక్కడికి వచ్చాను. ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదు” అన్నారు.
నేడు విజయవాడకు పయనం..
కాగా ఈ పర్యటనకు కాస్త బ్రేక్ ఇచ్చి నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ రానున్నారు. తమిళనాడు తంజావూర్ నుంచి విమానంలో బయలదేరి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం రానున్నారు. ఇవాళ సాయంత్రం ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొననున్నారు.. అనంతరం మళ్లీ దేవాలయాల బాట పట్టనున్నారు.