Delhi | బిసి రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించ‌క‌పోతే ధ‌ర్మ యుద్ధ‌మే – కేంద్రానికి రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ..

న్యూ ఢిల్లీ – బీసీ రిజర్వేషన్ల కోసమే ఢిల్లీ కి వచ్చామని, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కేంద్రంలోని మోదీ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఈ బిల్లును ఆమోదించ‌క‌పోతే 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్‌లో ధర్మయుద్ధం చేస్తామని కేంద్రాన్ని హెచ్చ‌రించారు.ఇక ఈ విషయంపై ఇక ఢిల్లీకి రాబోమని అన్నారు. గల్లీలోనే పోరాటం చేస్తామని అన్నారు.

విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ.ఆమోదించిన . బీసీ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు ఆధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నేటి ఉదయం బీసీల పోరు గర్జన ప్రారంభమైంది..

ఈ గ‌ర్జ‌న‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కులగణన చేపట్టొద్దంటూ తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నా ఆ పని చేశామని అన్నారు. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టి తీసుకొచ్చామని అన్నారు. జనాభా తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు. దానికి అనుగుణంగా స‌ర్వే చేసి బిసిల లెక్క‌లు తేల్చామ‌న్నారు..

ఈ లెక్క‌ల ప్ర‌కారం బిసి వాటాకు అనుగుణంగా నిధులు, నియామకాలు, చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. బలహీనవర్గాల లెక్క తేల్చాలని మొరార్జీ దేశయ్ మండలి కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 52 శాతం బలహీనవర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మండలి కమిషన్ ఆనాడే చెప్పిందన్నారు. అయితే, బీజేపీ కుట్ర చేసి మండలి కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర చేపట్టిందని గుర్తు చేశారు. బీసీల గొంత వినిపించేందుకే ఢిల్లీ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అసైన్డ్ చట్ట ద్వారా భూస్వాముల స్థలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. బీసీలను బలపరిచే ఆలోచనకు బీజేపీ పూర్తి వ్యతిరేకమని అన్నారు.

బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021లో జనాభా లెక్కలను వాయిదా వేశారని ఆరోపించారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో బలహీనవర్గాల లెక్క 56.36 శాతంగా తేల్చామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయలేదని సెటైర్లు వేశారు. రిజర్వేషన్లు పెంచడం కేంద్ర పరిధిలోని అంశమని.. ఆ విషయంపై బీజేపీ నేతలు స్పందించడం లేదని అన్నారు. అందుకే తాము ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందన్నారు. తమకు రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుతిస్తే.. 10 లక్షల మందితో సభ పెట్టి మోడీని సన్మానిస్తామని కామెంట్ చేశారు. దేశంలో రిజర్వేషన్లు పెంచుతారో లేదో ప్రధాని ఇష్టమని.. కానీ, తెలంగాణ రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిని స‌ఖ్య‌తలో కోరుతున్నామ‌ని, ఈ బిల్లును ఆమోదించ‌కుంటే బిసిల‌తో క‌ల‌సి ఎర్ర‌కోట‌పై త‌మ జెండాఎగుర‌వేస్తామ‌ని అన్నారు.. ఇప్ప‌డు రిజ‌ర్వేష‌న్ ల కోసం ఢిల్లీలో పోరు చేస్తున్నామ‌ని, ఇక భ‌విష్య‌త్ లో గ‌ల్లీ పోరుకు సిద్ద‌మ‌వుతామ‌ని రేవంత్ తేల్చి చెప్పారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ‌రిగి ఈ ధర్నాలో 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే బీసీల పోరు గర్జనకు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజ‌ర‌య్యారు.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్కు చెందిన బీసీ నేతలు కూడా ధర్నాలో పాలు పంచుకున్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎన్ సి పి శరద్ పవార్ గ్రూప్ ఎంపి సుప్రియా సూలే తో పాలు 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని బిసిల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *