నూతన గనులను సాధించుకోవడానికి కృషి చేయాలి
పని సంస్కృతిలో మార్పునకు కార్మిక సంఘాల సహకారం తీసుకోవాలి
కోలిండియా, సింగరేణి పై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక సమీక్ష
పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్
సింగరేణిపై సిఎండి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్ – రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింది. ఇందులో భాగంగా కోలిండియా సహా సింగరేణిపై నేడు కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై కీలక దిశా నిర్దేశం చేసింది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీ నుంచి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి తరఫున సంస్థ సిఎండి ఎన్.బలరామ్ హైదరాబాద్ సింగరేణి భవన్ నుండి ఈ సమీక్షలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బలరాం సింగరేణి సంస్థ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాలపై కూలంకశంగా వివరించారు.
ఈ సందర్భంగా .కిషన్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి ఖర్చు గణనీయంగా తగ్గించాలన్నారు. ఇందుకోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని, పని సంస్కృతి మెరుగుపరచాలని సూచించారు. అలాగే ఉత్పత్తి ఖర్చు తగ్గింపునకు సింగరేణి అధికారులు మరియు బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, కమిటీ చేసే ఆచరణాత్మక సూచనలను వెంటనే అమలు జరిపి ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని సూచించారు. వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై కూడా గట్టి దృష్టి పెట్టాలన్నారు.
బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ మాట్లాడుతూ… బొగ్గు సంస్థల మనుగడకు కొత్త గనులను పెంచుకోవడం అత్యంత అవసరమని, అలాగే ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు బొగ్గు ధర అందుబాటులోకి తీసుకురావొచ్చని, దీంతో అంతిమంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆయన కోల్ ఇండియా గనులతో పాటు సింగరేణి గనుల పనితీరును, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు(ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ రావు (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పి అండ్ పి, పా), ఈడీ శ్రీ ఎస్డీఎం.సుభాని తదితరులు పాల్గొన్నారు.