న్యూఢిల్లీ, (ఆంధ్రప్రభ): కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలోని ఆయన మంత్రిత్వ కార్యాలయంలో భేటి అయ్యారు.. ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు.. అయితే, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులుతో పాటు, బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతులుపై ఈ సమావేశంలో చర్చించారు.. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా నీటి ఎద్దడిని ఎదుర్కునే రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది.. గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తూ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది..
గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనగా ఉంది.. అయితే, దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు, ఆర్థిక సహకారాన్ని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు.. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తయ్యేలా సహకారం అందించాలని కూడా కేంద్రమంత్రిని కోరారు చంద్రబాబు.. ఇక, పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించాలని కేంద్రమంత్రిని ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.
