హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు (PV Narasimha Rao) 104వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలతో దేశ గతిని మార్చిన మహనీయుడు పీవీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. పీవీ నరసింహారావు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు. “భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను”
అదే విధంగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పీవీకి నివాళులర్పించారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తి గడించారని లోకేశ్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీ దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
పీవీ మన తెలంగాణ ఠీవి – కేసీఆర్…
‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్రావు (K. Chandrasekhar Rao) అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన దేశాభ్యున్నతికి చేసిన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బిడ్డగా, పాలనాదక్షుడిగా, భారత ప్రధానిగా.. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టి, జాతి ఔన్నత్యాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి పీవీ అని ప్రశంసించారు. బహు భాషా కోవిదుడుగా, సాహితీవేత్తగా, రాజకీయ దురంధరుడుగా, దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన తీరు అజరామరమని పేర్కొన్నారు.