నిజామాబాద్ ప్రతినిధి, మే 5 (ఆంధ్రప్రభ) : వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తూ ప్రోత్సాహకాలను అందజేస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ప్రతి పంటపై నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రైతులు అవగాహన కలిగి ఉన్నా రని, దేశంలోనే నిజామాబాద్ ప్రాంతంలో ప్రగతిశీల రైతులున్నారని ఎంపీ తెలిపారు. హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూర్ నుంచి పునాది వేయ బడిందన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో జెఎంకెపిఎం రైతు పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమ బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఐఏఎస్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఎంపీ ధర్మపురి పసుపు ఆధారిత పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం జయశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రధాని మోడీ నాయకత్వంలో టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో అంత మొందించడానికి మోడీ ధీటైన జవాబు ఇవ్వనున్నారన్నారు. మోడీజీ భారతదేశ్ కా సడక్ బనానేలియే.. నహి అయే… భారతదేశ కో జగద్గురు స్థాన్ మే ఖడా ఖాడానే లియే అయే అని ఎంపీ తెలిపారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండడం ప్రతి ఒక్క భారతీయుడి అదృష్టమన్నారు.
2019లో ఎంపీగా పోటీచేసిన సందర్భంలో 178 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి సుమారు 94వేల ఓట్లు రైతులకు వచ్చాయి. కానీ 72వేల ఓట్లతో ఎంపీగా గెలిచానన్నారు. నా పార్టీకి గాని, వ్యక్తిగతంగా కానీ, ప్రధాని మోడీకి నేను చేయాల్సింది ఒకటే ఆ 94వేల ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చేలా పనిచేస్తానని ఎంపీ తెలిపారు. రేవంత్, కవిత ఒక కంపెనీలో డైరెక్టర్లుగా పనిచేశార ని తెలిపారు. రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ ఒకటేనని ఎంపీ తెలిపారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. కో ఆపరేటివ్ సెక్టార్ లో ఏర్పడే పరిశ్రమలకు ఇందూరు ప్రాంతం ఎంతో అనుకూలమని ఎంపీ చెప్పారు.
తెలంగాణలోని పాకిస్తానీయులను వెంటనే పంపించాలి..
తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులను వెంటనే పంపించేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణాలో పాకిస్తానీయులు ఒక్కరు కూడా ఉండొద్దన్నారు. బోధన్ ప్రాంతమంతా రోహింగ్యాలకు అడ్డాగా మారిందనీ ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోధన్ ప్రాంతంలో ఒకటే ఇంటిపై సుమారు 40కు పైగా దొంగ పాస్ పోర్ట్ లు దొరికిన సంఘటనను ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్ లో బీజేపీకి 70శాతం ఓట్లు వస్తాయనీ ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ప్రాణాలు అంటే మీకు లెక్క లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్లు, పసుపు రైతులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.