Birsa Munda | బిర్సా ముండా జీవిత చరిత్ర ఆదర్శణీయం

గిరిజన హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తి
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్
బీరసా ముండా పుస్తకం ఆవిష్కరించిన ఎంపీ
Birsa Munda | విజయవాడ, ఆంధ్రప్రభ : గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించటం చాలా ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బిర్సా ముండా 150 జయంతిని పురస్కరించుకుని తెలుగులో ముద్రించిన డాక్టర్ మోహన్ భాగవత్ రాసిన భగవాన్ బిర్సా ముండా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా చిరస్మరణీయుడన్నారు. బిట్రీష్ వారిపై బిర్సాముండా చేసిన పోరాటాలు గిరిజనుల్లో చైతన్యం నింపి ఆదీవాసులకు ఆరాధ్య దైవంగా మారాడన్నారు. బిర్సా ముండా గిరిజనుల హక్కుల కోసం, గిరిజన జాతుల ఆచారాలు, సాంఘిక విలువలకు గౌరవం తీసుకురావటం కోసం పోరాడారని తెలిపారు. బిర్సా ముండా పోరాటం, సత్యం, న్యాయం, లక్ష్యాలుగా సాగిందన్నారు. జనజాతీయ గౌరవ దివస్ వల్ల బిర్సా ముండా లాంటి ఎంతో మంది గిరిజన వీరుల గాథలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రికు ప్రాధాన్యత లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వి. నరసింహా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా పాల్గొన్నారు.
