ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్థంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా అధికారులు, గౌడ సంఘం నేతలతో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
ముందుగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారని ఎమ్మెల్యే చెప్పారు. గౌడ కులస్తుల సంక్షేమం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.