AICC Meeting – ప్రారంభ‌మైన కాంగ్రెస్ పార్టీ మేథోమ‌ధ‌నం – హాజరైన రెండువేల మందికి పైగా ప్రతినిధులు

అహ్మాదాబాద్ వేదిక‌గా రెండు రోజుల పాటు స‌మావేశాలు
సోనియా, రాహుల్, ఖ‌ర్గే, రేవంత్ లు హాజ‌రు
రెండు వేల‌కు మందికి పైగా కాంగ్రెస్ నేత‌లకు ఆహ్వానాలు
వివిధ అంశాల‌పై చ‌ర్చించ‌నున్న నేత‌లు
64 ఏళ్ల త‌ర్వాత ఎఐసిసి కి అతిథ్యం ఇస్తున్న గుజ‌రాత్

అహ్మ‌దాబాద్ – గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వందేళ్లు, సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2000 మంది ఏఐసీసీ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.. దాదాపు 64ఏళ్ల తర్వాత తొలిసారి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ ప్లీనరీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. 1902, 1921లో సబర్మతి తీరంలో జరిగిన సదస్సులు కాంగ్రెస్‌కు కొత ్తశక్తిని ఇచ్చాయి. అదే మాదిరిగా 2025 సదస్సు కష్టకాలంలో ఉన్న పార్టీకి కొత్తదిశను చూపుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ సమావేశం దేశం కోసం కాకపో యినా, కనీసం పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయగలదా? గుజరాత్‌లో దాదాపు నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్‌ స్థితిని పునరుద్ధరించడానికి దోహదపడ గలదా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

ఇక ఈ స‌మావేశంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఎన్నికలు, పార్టీ పునరుజ్జీనం కోసం అవసరమైన రోడ్ మ్యాప్‌పై చర్చించి కార్యాచరణ, తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఇతర పార్టీలతో పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.

దేశ రాజకీయాల్లో దూకుడు మీదున్న బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్లు స‌మాచారం. ఇక ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు, 2026లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిగా ఎన్నికలకు వెళ్లడం, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవాలపై చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో పార్టీ పోరాటాలు, ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఉండనున్నాయి.

తెలంగాణ నుంచి 40 మందికి ఆహ్వానం ..

ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 40 మంది నేతలకు ఆహ్వానం అందింది. సీఎం రేవంత్‌రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, వంశీ చందర్‌రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *