Delhi | కులగణన సర్వే వివరాలను కెసి వేణుగోపాల్‌కు అందజేశాం : డిప్యూటీ సీఎం భట్టి

కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి వక్‌మార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, దీపదాస్‌ మున్ఫీ పాల్గొన్నారు. అయితే ఈ భేటీ అనంతరం.. సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు భట్టి.

కులాల గణనతోపాటు ఎస్సీ వర్గీకరణ, పీసీసీ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీ కోరిక మేరకే రాష్ట్రంలో కుల గణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించిన కులగ‌ణ‌న సర్వేలో దాదాపు లక్షలాది మంది సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ కుల గణన సర్వే వివరాలను కెసి వేణుగోపాల్‌కు అందజేశామన్నారు. తెలంగాణలో కులగ‌ణ‌న‌, ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. బహిరంగ సభలపై అధిష్టానంతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పథకాలను పార్టీ పెద్ద‌ల‌కు వివరించాం అని తెలిపారు. కులగ‌ణ‌న‌, ఎస్సీ వర్గీకరణపై తెలంగాణలో జరిగే బహిరంగ సభకు రాహుల్ ను ఆహ్వానించడంపై చర్చించిన‌ట్టు వెల్ల‌డించారు.

ఇక‌ ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న రేవంత్ రెడ్డి బృందం.. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు కాంగ్రెస్ నేతలతో భేటీ కానుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్‌తో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది.

Leave a Reply