- రూ.30వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
- ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఓ ప్రైవేట్ మెడికల్ షాప్ యజమాని నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటూ అదిలాబాద్ జిల్లా ఎక్స్టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డిఇఎంవో ) రవి శంకర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూర్ లో ఓ మెడికల్ షాపు యజమాని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అబార్షన్ కోసం ఇటీవల మందులు సరఫరా చేశాడని వైద్యాధికారులు ఆ మెడికల్ షాప్ కు తాళం వేశారు. మెడికల్ షాపు తెరిపించడం కోసం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవిశంకర్ గతంలో నల్గొండ జిల్లా మాస్ మీడియా అధికారిగా పనిచేసి పనిష్మెంట్ పై ఆదిలాబాద్ వచ్చారు. జిల్లా కేంద్రంలోనే రెండు వారాల గడువులోనే ఇద్దరు జిల్లా అధికారులు ఏసీబీ వలలో చిక్కడం కలకలం రేపుతోంది.
ఏసీబీకి చిక్కిందిలా…
మన్నూరు సమీపంలోని గురజా గ్రామానికి చెందిన ఓ యువతి అబార్షన్ కోసం ఈ మెడికల్ షాప్ నుండే మందులు సరఫరా చేశారని కేసు నమోదు చేశారు. రూ.30వేలు లంచం ఇస్తేనే షాపు తెరిపిస్తామని బేరం కుదుర్చుకోవడంతో బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం డీఎంహెచ్ ఓ కార్యాలయంలో జిల్లా మెడికల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎం.రవిశంకర్ కు రూ.30వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ కిరణ్ రెడ్డి పట్టుకున్నారు. నిందితుడు రవి శంకర్ ను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్టు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.