భువనేశ్వర్ : తన నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేయనున్నారనే ముందస్తు సమాచారంతో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తన అపార్ట్మెంట్లోని కిటికీ నుంచి రూ.500 నోట్ల నగదు కట్టలను విసిరేశాడు. అయితే ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠ నాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అతడి నివాసంపై గత రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే అతడి బంధువులకు సంబంధించిన నివాసాలపై ఏకకాలంలో దాడులు చేశారు. అయితే దాడికి వస్తున్నారని తెలుసుకున్న సారంగి వెంటనే తన వద్ద ఉన్న రూ.కోటి నగదు కట్టలను కిటికిలోంచి బయటకు విసిరేశారు.
ఇది జరిగిన అయిదు నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం రూ. 2.1 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని అతని ప్లాట్లో రూ.కోటి నగదు స్వాధీనం చేసుకోగా, మరో రూ.1.1 కోటి నగదును అతడి బంధువు ఇళ్లలో గుర్తించారు. వీటిని వారు స్వాధీనం చేసుకున్నారు. అయితే సారంగి నివాసంలో స్వాధీనం చేసుకున్న నగదులో రూ.500 నోట్లు, రూ.100, రూ.200, రూ.50నోట్ల కట్టలే అధికంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.