హైదరాబాద్ : ఈ 2025 తెలుగు సంవత్సరాది వసంత నవరాత్రుల నుండి వచ్చే 2026 వసంత నవరాత్రుల్లోగా జంట నగరాలలో ఇరవై ఒక్క ప్రాంతాలలో ఇరవైఒక్క అభయగణపతి దేవాలయాలు సాక్షాత్కరించబోతున్నాయి.
ప్రముఖ రచయిత , ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మూడు మాసాలక్రితం ఒక సభలో ‘ ఏక వింశతి గణపతుల మంగళ ప్రతిష్టాపన స గురించి మాట్లాడుతూ చేసిన అఖండ సంకల్పానికి స్పందించి ఇరవై ఒక్క గణపతుల ప్రతిష్టాపనకు అనేక మంది సాంస్కృతిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు రావడం గమనార్హం.
పుస్తక మాంత్రికునిగా వేల వేల భారతీయ ధార్మిక సనాతన వైదిక గ్రంధాల రచనలతో, సంకలనాలతో అపురూపమైన పవిత్రతలతో దూసుకుపోతున్న పురాణపండ శ్రీనివాస్ అఖండ సంకల్పం ఈ శుక్రవారం శ్రీకార్యం చుట్టుకోబోతోంది.
దశాబ్దాల ఘన సాంస్కృతిక చరిత్ర ఉన్న త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఏప్రిల్ 4వతేదీన ఉదయం పదకొండు గంటలకు వేదవిదుల సమక్షంలో పురాణపండ శ్రీనివాస్ అతి అరుదైన కృష్ణశిల అభయ గణపతికి ఆలయ శాస్త్ర మర్యాదానుసారం పూజార్చనలు నిర్వహించి మంగళ ప్రతిష్టాపన చేస్తారు.
ఈ శ్రీకార్యంలో త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి పర్యవేక్షణలో వేద పండితులచే హోమ క్రతువులు, మంత్ర పాఠాలు, మహాగణపతి యంత్ర మంత్ర స్తోత్రాది విద్యల పారాయణలతో, వేద స్వస్తి వంటి అంశాలు చోటు చేసుకుంటాయి.
తెలుగు రాష్ట్రాలలో సాహిత్య సాంస్కృతిక రాజకీయ వైదిక నాట్యాది విశేష అంశాలకు అపూర్వ అద్భుత వేదికగా దశాబ్దాల ఖ్యాతి సంపాదించుకున్న త్యాగరాయ గాన సభ ఆవరణలో ఈ అభయ గణపతి ఆలయ నిర్మాణం కావడం, ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి కృష్ణ శిలని ఉపయోగించడంపట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఉదాత్త సంకల్పంతో పురాణపండ శ్రీనివాస్ మేలు పవిత్రతల పిలుపు ఇచ్చారో గానీ ఎందరో ఈ అపూర్వ అభయ గణపతి ఆలయ నిర్మాణాలకు ముందుకు రావడం కేవలం గణాధిపతి వినాయకుని అనుగ్రహ విశేషమేనని పలువురు పురాణపండ శ్రీనివాస్ పై ప్రశంసలు వర్షిస్తున్నారు.
తొలుత ఈ పవిత్ర అంశానికి స్పందించి ముందుకు వచ్చిన త్యాగరాయ గాన సభ అధ్యక్షులు, నిత్యం సాహిత్య సాంస్కృతిక అంశాలు అందరికీ అందాలని తపన పడే కళా జనార్ధనమూర్తి ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి , విధుశేఖర భారతీ మహా స్వామి వార్ల కారుణ్యమేనని నగరంలోని శంకరమఠాల ప్రతినిధులు ముక్తకంఠంతో అభినందనలు తెలుపుతున్నారు.
ఈ అభయగణపతి ప్రతిష్టాపనలో తమను ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తదితరులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు.