TGRTC | హైదరాబాద్ కనెక్ట్…
- 373 కొత్త కాలనీలకు ఆర్టీసీ విస్తరణ
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలోని కొత్త కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో సరికొత్త ప్రణాళికను ప్రకటించింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల నుంచే రోడ్డెక్కనున్న ఈ కొత్త సేవల ద్వారా సుమారు 7,61,200 మందికి లబ్ధి చేకూరనుంది.
ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యార్థం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఎంప్లాయిమెంట్ హబ్ల నుంచి కాలనీలకు నేరుగా బస్సులను నడపనున్నారు. మూడు దశల్లో అమలు చేయనున్న ఈ కార్యక్రమం ద్వారా సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ట్రాఫిక్ రద్దీ, ఏయిర్ పోల్యూషన్ని నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రయాణికులు బస్సుల రాకపోకలను రియల్ టైమ్లో తెలుసుకునేందుకు గమ్యం యాప్ను ఉపయోగించుకోవచ్చు, అలాగే ఈ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన 373 కాలనీలలో హైదరాబాద్ రీజియన్లో 243, సికింద్రాబాద్ రీజియన్లో 130 కాలనీలు ఉన్నాయి.

