సిరిసిల్ల : నేతన్నలకు అండగా ప్రభుత్వం నిలవాలని కోరుతూ డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ రాశారు. సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేయాలని, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీ (Electricity subsidy) ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
హైకోర్టు ఆదేశాలతో పెరిగిన భారం…
కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50శాతం విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, ఎస్ఎస్ఐ యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ – 3 కేటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ (KTR) వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ. 35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు.
పవర్ లూమ్స్ (Power Looms) కు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ – సెస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కేటీఆర్ తెలిపారు. నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం ((Deputy CM) భట్టికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.