- పోలీసింగ్లోకి కృత్రిమ మేథ..
- గుంటూరులో AI4 Andhra Police హ్యాకథాన్కు శ్రీకారం
- మూడు రోజులపాటు జరగనున్న జాతీయ స్థాయి హ్యాకథాన్
- పోలీసుల సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులోని ఆర్వీఆర్ & జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న “AI4 ఆంధ్ర పోలీస్ హ్యాకథాన్” కు శుక్రవారం శ్రీకారం చుట్టారు. జూన్ 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి హ్యాకథాన్, పోలీసు శాఖలో కృత్రిమ మేధస్సును (AI) ప్రవేశపెట్టి పనితీరును ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్ గుప్తా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, “కృత్రిమ మేధ భవిష్యత్తు కోసం కాదు — ఇదే ప్రస్తుత అవసరం. పాలనను సమర్థవంతంగా చేయడానికి, పోలీసింగ్ను ఆధునీకరించేందుకు ఇది కీలక సాధనం” అని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంచడంలో ఏఐ ప్రధాన అడుగుగా అభివర్ణించారు.
గత పాలనలో రౌడీయిజం, నక్సలిజం, స్మగ్లింగ్ వంటి సమస్యలను సమర్థవంతంగా అణిచిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, తన పాలనలో రాష్ట్రంలో క్రిమినల్స్కు స్థానం ఉండదు అని అన్నారు. ప్రస్తుతం పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో నేరాల విచారణ, నిఘా, సమయానుకూల సమాచారం విశ్లేషణ, క్రిమినల్ ప్రొఫైలింగ్ తదితరాల్లో కృత్రిమ మేధ వినియోగం అవసరమైందన్నారు. “నేడు నేరం చేసే వ్యక్తుల ఆచరణ తీరు మారిపోతున్నది. వారిని కచ్చితంగా గుర్తించడానికి, నిర్ధిష్ట పరిష్కారాలు అందించడానికి AI, డేటా ఆధారిత విధానాలే మార్గం. ఈ దిశగా ఏఐ, డేటా ఆధారిత పాలనలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలి” అని చెప్పారు.
ఈ హ్యాకథాన్ను 4SightsAI అనే ప్రైవేట్ టెక్నాలజీ సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశం నలుమూలల నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ 60కి పైగా బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు కలిసి పోలీసులు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రధాన సమస్యలకు AI ఆధారిత పరిష్కారాలను రూపొందించనున్నారు.
ప్రభుత్వం ఈ కార్యక్రమంలో యువతను ప్రోత్సహించేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా, ఉచిత వసతి కల్పించడం విశేషం. హ్యాకథాన్లో AI ఆధారిత పరిష్కారాలు రూపొందించిన విజేతలకు రూ.10 లక్షల నగదు బహుమతులు అందించనుండగా, ఉత్తమ పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా రాష్ట్రంలో అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.