హైదరాబాద్ – నగరంలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ (balakampet temple ) ఆలయానికి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (nita ambani) భారీ విరాళం అందజేశారు. ఎల్లమ్మ గుడికి కోటి రూపాయల (one crore ) విరాళం (donation ) అందించారు నీతా అంబానీ. నేరుగా టెంపుల్ బ్యాంక్ ఖాతాకు విరాళాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. కాగా, ముఖ్యంగా నగరంలో ఉప్పల్ స్టేడియం లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నా సమయంలో నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కృష్ణ వారికి ఆలయ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు. అప్పటి ఈవో విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా ఇప్పుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు.
త్వరలో ఆషాడ మాసం రానుంది. భాగ్యనగరం బోనాలు సంబరాలకు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబవుతుంది. నీతా అంబానీ కోటి రూపాయల విరాళం బుధవారం రోజున దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయింది. ఈ విరాళం సొమ్ము మొత్తనాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామన్న ప్రస్తుత ఈఓ మహేందర్గౌడ్ చెప్పారు.