TG | మహబూబ్ నగర్ లో దారుణం.. క్లాస్ రూంలో ఉరేసుకున్న స్టూడెంట్

  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన టీచర్లు
  • అప్ప‌టికే మ‌ర‌ణించిన విద్యార్ధిని


మహబూబ్ నగర్ : గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఉరి వేసుకుంది. తోటి విద్యార్థులు గమనించి టీచర్లకు చెప్పడంతో అంతా కలిసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థిని చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుందీ విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య బాలనగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

ఏం జరిగిందో ఏమో కానీ గురువారం గురుకుల పాఠశాలలోని తరగతి గదిలో ఆరాధ్య ఉరివేసుకుంది. ఉదయం 6:30 గంటలకు ఆరాధ్య సీలింగుకి వేలాడుతుండడాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. టీచర్లను పిలుచుకు వచ్చి ఆరాధ్యను కిందకు దింపారు. ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, ఆరాధ్య ఆత్మహత్యకు కారణాలేంటనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *