కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున నగరంలోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై కర్నూలు రెండవ పట్టణ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణరెడ్డి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, మన్సురుద్దీన్, నాగశేఖర్, ఎక్సైజ్ సిఐలు చంద్రహాస్, జయరాం నాయుడు, క్రిష్ణ, 5 బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు.
65లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 1350 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారాకు కారకులైన ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలన ఆవశ్యకత గురించి, నాటుసారా వలన వచ్చే అనర్థాల గురించి తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నాటుసారా జోలికి వెళ్లొద్దని, నాటుసారా కాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు ఇక నుండి మానుకోవాలని పోలీసులు హితవు పలికారు.
