WPL 2025 | రేపే డబ్ల్యూపీఎల్ కు శంఖారావం !
- బరిలో ఐదు జట్లు.. డిఫెండింగ్ చాంప్ గా ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభంకానుంది. కాగా, టైటిల్ కోసం మొత్తం ఐదు జట్లు తలపడుతుండగా.. రేపు తొలి లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇక గతేడాది టైటిల్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేపటి తొలి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ఆర్సీబీ ఢీకొంటుంది.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగబోతున్న బెంగళూరు.. మరోసారి టైటిల్ దక్కించుకోవాలని ఉత్సాహంగా ఉంది. అయితే ఈసారి నాలుగు వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి… వడోదర, ముంబై, లక్నో, బెంగళూరులలో మ్యాచ్లు జరగనున్నాయి.
ఈటోర్నీలో రాయల్ చాలెంజర్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. 2023లో జరిగిన తొలి ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ గెలిచింది. రెండో సీజన్ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అయితే గత రెండు ఎడిషన్లలో ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్ గా నిలిచింది.
కాగా, ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు దాదాపు నెల రోజుల పాటు జరగనుండగా.. ప్రతి జట్టు మరో జట్టుతో రెండు మ్యాచ్లు ఆడుతుంది. మొత్తం 20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. టాప్ 2, 3 జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది.