మున్సిపల్ యంత్రాంగానికి పట్టింపేదీ?
వెలగని లైట్లు.. అంధకారంలో పట్టణం
మక్తల్, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : నారాయణపేట (Narayanpet) జిల్లాలోని మక్తల్ పట్టణం అంధకారంలో మగ్గుతోంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రాత్రి వేళల్లో ప్రధాన రహదారుల్లో నిశీధి రాజ్యమేలుతోంది.పట్టణం గుండా 167 వ జాతీయ రహదారి వెళుతుంది. ధగధగా వెలుగుల్లో పట్టణం మెరిసిపోవాల్సి ఉండగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో చిమ్మ చీకట్లో మగ్గుతోంది. మంగళవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా పట్టణ ప్రజలు దీపాలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
పండుగ సందర్భంగా బాణసంచా వెలుగులు తప్ప వీధిలైట్ల వెలుతురు లేక చీకట్లు కనిపించాయి. జాతీయ రహదారి(National Highway) తో పాటు పట్టణ ప్రధాన రహదారి అదేవిధంగా పలు కాలనీల్లో లైట్లు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా మునిసిపల్ అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.