Pawan Kalyan | చిత్తశుద్ధితో పని చేస్తున్నాం..

  • ఏపీని అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం
  • ఏడాది సుపరిపాలనపై ప్రగతి నివేదిక
  • సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం ముందుకెళ్తోంది

అమరావతి: ‘రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. అలా నిరంతరం పరితపించే నేను గత సంవత్సర కాలంలో చేపట్టిన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నా నైతిక బాధ్యత. అధికార బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను..’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​ పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పవన్​కల్యాణ్​ బాధ్యతలు చేపట్టి గురువారంతో సంవత్సరం పూర్తైన సందర్భంగా సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేశారు. దీనితో పాటు పవన్​కల్యాణ్​ ఓ లేఖను విడుదల చేశారు.

‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు… గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి అండగా నిలబడి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్లు నుండి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’ అని ఆయన పేర్కొన్నారు.

2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయింది, అభివృద్ధికి దూరమైంది, శాంతిభద్రతలు క్షీణించాయి, యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి, మహిళలకు రక్షణ కరువైం దని తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా కదలకుండా నిర్మానుష్యంగా మారిన సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు, రాష్ట్రంలో ప్రజాస్వామ్మ పరిపాలనను పునరుద్ధరించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలో, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ప్రజల పక్షాన ఎల్లవేళలా నిలబడి పోరాడే మన సమిష్టి సహకారంతో ఎన్​డీఏ కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలిచి 94% స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు.

ఇంతటి గెలుపును అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు, మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేస్తూ సంవత్సర కాలంలోనే గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామన్నారు.

సుపరిపాలనకు కేంద్ర సహకారం:

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి నేడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమిష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ: పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్టీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలనే మా సంకల్పాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

గత ఐదేళ్ళలో నియంతృత్వ పాలన..:

గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏడాదిగా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పవన్ కల్యాణ్ ప్రగతి నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి విజయానికి అండగా నిలబడిన ప్రతిఒక్కరికీ, అలానే రాష్ట్రాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ప్రతిఒక్కరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపాం..:

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారిలో విశ్వాసం నింపామని అలానే కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలుస్తోందని పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టి నాయకుని పాలనలో రాష్ట్రం ముందుకెళ్తోందని అన్నారు. రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

Leave a Reply