- నిధులు కేటాయించిన నిర్మాణంలో అలసత్వంపై అసంతృప్తి
- జూన్ మొదటి వారం కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు
భద్రాచలం, ఏప్రిల్ 4 (ఆంధ్రప్రభ) : భద్రాచలంలో నిధులు కేటాయించినప్పటికీ కరకట్ట పనులు పూర్తి కాకపోవడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం భద్రాచలంలో పర్యటించిన స్థానిక సుభాష్ నగర్ కాలనీ ప్రాంతంలో జరుగుతున్న కరకట్ట పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో బాధ్యులను పిలిచి పనులు జరుగుతున్న విధానంపై ఆరా తీశారు. దీనికి సంబంధిత అధికారులు ఇరిగేషన్ శాఖ వారు సహకరించడం లేదని తెలపటంతో మంత్రితోనూ, సంబంధిత బాధ్యతను మాట్లాడతానని తక్షణమే వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
మళ్లీ జూన్ వస్తే వర్షాలు ప్రారంభమవుతాయని, మళ్లీ భద్రాచలం ముంపునకు గురికావాలా అంటూ అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హైవే డీఈతో సైతం ఆయన మాట్లాడారు. ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాకపోవడం కారణమేంటని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ… సంబంధిత శాఖ డీఈ, ఎస్.ఇ, సి.ఇలతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.