తపాల్పూర్ అడవుల్లో చెట్ల నరికివేత..

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం అటవీ డివిజనల్ తాళ్లపేట రేంజులోని తపాల్ పూర్ అడవుల్లో శుక్రవారం రాత్రి గిరిజనులు సుమారు 100 చిన్న, పెద్ద టేకు, నాన్ టేకు చెట్లను నరికి వేశారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన గిరిజనులు అక్కడి నుంచి పరారయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు తుపాల్ పూర్ అడవిలోకి వచ్చి రాత్రి మూకుమ్మడిగా ఆ చెట్లను నరికి వేశారు. అనాదిగా అడవుల్లో ఉంటున్నా మల్యాల గ్రామ గిరిజనులకు రీ లొకేషన్లో భాగంగా వేరే ప్రాంతంలో అనువైన స్థలం చూపించడంలో అధికారులు విఫలమైనందుకే ఆ గిరిజనులంతా మూకుమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చి ఈ ప్రాంతంలో చెట్లను నరికివేతకు పూనుకున్నట్లు సమాచారం. ఈ విషయమై తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావును శనివారం ఉదయం సంప్రదించగా, తపాల్ పూర్ అడవుల్లో గిరిజనులు శుక్రవారం రాత్రి చెట్లను నరికి వేసింది నిజమేనన్నారు. ఎన్ని చెట్లు నరికి వేసింది, ఎంత విలువ అనేది ఎన్నుమురేషన్ చేసిన తర్వాత తెలుపనున్నట్లు ఆమె చెప్పారు.

