Top Story | మాతృదేవోభవ..!అతడికి అమ్మే సర్వస్వం

మంచం పట్టిన అమ్మకు అన్నీ తనయుడే..సకల సేవలు చేస్తూ సర్వం త్యాగంనవతరానికే ఆదర్శం నరసింహారాజుఅమ్మ అంటే అంగట్లో దొరికే వస్తువు కాదు… కోట్లు కుమ్మరించినా దొరకనిది అమ్మ ప్రేమ. అమ్మ అనే పిలుపు దక్కిన బిడ్డలు అదృష్టవంతులు.. ఈ కలికాలంలో కనీసం తల్లిదండ్రులను పట్టించుకోని కన్నబిడ్డల కథలెన్నో.. కానీ అమ్మ కోసం పరి తపించే కొడుకులు ఇంకా ఉన్నారు. మాతృమూర్తికి సకల సేవలు అందించే పుత్రులూ ఉన్నారు. ఏడుపదుల ప్రాయంలోనూ ఓ కొడుకు 90 ఏళ్ల అమ్మ కోసం పరితపిస్తున్న తీరు నేటి సమాజానికి, నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు ఓ వ్యక్తి. అంత్యదశలో మంచం పట్టిన తల్లి కోసం ఈ కొడుకు సర్వం త్యాగం చేశాడు. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మే సర్వస్వం అని జీవిస్తున్న కొడుకు సేవలు నేటి తరానికి ఆంధ్ర ప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

నర్సాపురం ఆంధ్రప్రభ: నర్సాపురం పట్టణం మాధవాయపాలేనికి చెందిన కొల్లు రామచంద్రమ్మ (91) డబ్బై ఏళ్ళ కిందటే భర్తను కోల్పోయింది. ఆమెకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు కాలం చేశారు. రెండో కుమారుడు జీవనోపాధి కోసం ముంబై పగరానికి వలస వెళ్లిపోయారు. ఆమె ఏకైక కుమార్తె జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో ఉంటోంది. ఇక తల్లికి మిగిలింది.. పెద్ద కుమారుడు కొల్లు లక్ష్మీ నరసింహరాజు (72) తో కలిసి ఆమె జీవిస్తోంది. నర్సాపురం లేసు అల్లికలకు ప్రసిద్ధి గాంచిన విషయం విధితమే.

ఆ లేసు అల్లికలే ఆమె కుటుంబ పోషణకు జీవనాధారం అయ్యాయి . చేతికందిన కొడుకులు తెచ్చిన కొద్దిపాటి జీతం కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచాయి . ఆమె పెద్ద కుమారుడు కొల్లు లక్ష్మీ నరసింహరాజు .. అపర భీష్మాచార్యుడిలా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ కష్టసుఖం లలో పాలు పంచుకున్నాడు. పెద్ద కుమారుడు సహాయ సహకారాలు తో మిగిలిన సంతానానికి వివాహాది శుభ కార్యాలు జరిపించి కుటుంబ బాధ్యతలను చక్కబెట్టిన రామ చంద్రమ్మ కు వయస్సు మీద పడటమే గాకుండా ప్రమాదవశాత్తు చట్ట విరిగి మంచం పట్టింది. మెరుగైన వైద్య సేవలు అందించిన ఆమెకు నయం కాలేదు. 2016 నుంచి గత తొమ్మిదేళ్లుగా మంచం పట్టిన తల్లి కి పెద్ద కొడుకు లక్ష్మీ నరసింహరాజు అన్నీ తానై సకల ఉపచారాలు చేస్తున్నాడు.

పెయింటింగ్ పని చేసుకుంటూ, తల్లి కి సపర్యలు చేస్తున్నాడు. అతను కూడా ఏడు పదులు వయసు రావడం తో పని మానేసి తనకు, తన తల్లికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తో కాలం గడుపుతున్నారు. రెండో కుమారుడు పంపించే సొమ్ము వైద్య ఖర్చులకు ఆసరాగా నిలుస్తోంది.తల్లే దైవంగా సేవ..బాల్య దశలో తల్లి తినిపించిన గోరు ముద్దలు నేటికి కళ్లెదుట కదలాడుతున్నాయి. స్వార్ధం లేని ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. మంచం పట్టిన అమ్మకు ఆలనా పాలనా చూసుకుంటూ…తల్లి దండ్రులను పట్టించుకొని పుత్ర రత్నాలకు కొల్లు లక్ష్మీ నరసింహరాజు ఆదర్శంగా నిలిచారు.

తొమ్మిది పదుల వయసులో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అద్దె ఇంటిలో, అదికూడా శిథిలావస్థకు చెందిన రేకుల షెడ్ లోని ఒకే ఒక్క గదిలో తల్లీ కొడుకులు నివాసం ఉంటున్నారు. వంటా వార్పు నుంచి తల్లిని చక్క బేట్టే ప్రతీ కార్య క్రమాన్నీ అతనే స్వయంగా చూసు కుంటాడు. భోజన వసతితో పాటు మల, మూత్ర విసర్జనలను ఎత్తి పోయడం వరకు సేవలందించి తల్లి పై ఉన్న ప్రేమను చాటి చెబుతున్నాడు. వారున్న గదిని శుభ్రం చేసుకుంటూ తల్లి కి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసే కొడుకు ఈ రోజుల్లో ఉండటం ఆమె పూర్వ జన్మ సుకృతం అని స్థానికులు చెబుతుంటారు.

అతని సోదరుడు కొడుకు, కుమార్తె లు లక్ష్మీ నరసింహరాజుకు సహాయ సహకారాలు అందిస్తుంటారు.కొడుకే లేకపోతే ప్రాణం ఎప్పుడో పోయేది.కొడుకు ఆదరాభిమానాలకు తల్లి ఉప్పొంగి పోతుంది. నేను ఏ నాడో చేసుకున్న పుణ్యఫలం నా పెద్ద కొడుకు రూపంలో దక్కింది. నా కొడుకు, మనవడు, మనవరాలు చూస్తున్నారు కాబట్టే నేనింకా బతికి ఉన్నాను.లే కపోతే ఏ నాడో ప్రాణం విడిచే దానిని అంటూ రామచంద్రమ్మ ఆనంద భాష్పాలు కార్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *