NLG | ఇది కాలం తెచ్చిన కరవు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరవు…

మోతె, మార్చి12(ఆంధ్రప్రభ) : ఇది కాలం తెచ్చిన కరవు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరవని, కాలేశ్వరం నీళ్లు విడుదల చేసి, ఎండిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని కోదాడ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ లు అన్నారు. బుధవారం మోతె మండల పరిధిలోని బిక్య తండా, బల్లుతండా, లాల్ తండా, రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామాల్లో ఎండిపోయిన పొలాలను వారు పరిశీలించారు. రైతులతో కలిసి కాలేశ్వరం నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సారెస్పీ కాలువలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎండిన పంట పొలాలను అంచనా వేసి, ప్రతి ఎకరాకు రూ.30,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరవని ఎద్దేవా చేశారు. కానరాని SRSP నీళ్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మోతె రైతులను ఆదుకోవాలన్నారు. అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలిపారు. యాసంగి సాగులో నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు నీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. సాగునీరందక పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళనలో రైతన్నలు ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. పొలాలు ఎండుతుంటే.. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతుండగా.. కొందరు రైతన్నలు జీవాలకు మేతగా వదిలివేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మోతె మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మండల నాయకులు నూకల యుగంధర్ రెడ్డి, మద్ది మధుసూదన్ రెడ్డి, మిక్కిలినేని సతీష్, నూకల శ్రీనివాస్ రెడ్డి, పల్సు మాల్సూర్, యూత్ అధ్యక్షులు జానీ పాషా, మండల నాయకులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, దేవుల, గుండాల గంగులు, బుక్య బాబు, గాంధీ, కాంపాటి వెంకన్న, జీల్లెపలి ముత్తయ్య, పిట్టల నగేష్, సాజ్య, మండల నాయకులు, రైతులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *