5 తులాల బంగారు ఆభరణాలు రికవరీ

5 తులాల బంగారు ఆభరణాలు రికవరీ
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు (Kurnool ) నగరం కల్లూరులోని తెలుగు వీధిలో నివాసం ఉంటున్న కారు డ్రైవర్ గురుస్వామి ఇంట్లో గత ఫిబ్రవరి 19 వ తేదీన దొంగలు పడి బీరువాలోని సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. గురుస్వామి ఫిర్యాదు మేరకు కర్నూలు 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikrant Patil) ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగో పట్టణ ఇన్స్పెక్టర్ విక్రమ సింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ షాకీర్, కానిస్టేబుళ్లు ఎల్లా శివుడు, సుబ్బరాయుడు ప్రత్యేక బృందం దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల జైల్ల నుంచి రిలీజ్ అయినటువంటి నిందితుల వివరాలను సేకరించి విచారణ చేపట్టారు.
దొంగతనం జరిగిన టైంలో గుడివాడకి చెందిన జగదీశ్ (Jagadish) కదలికలు ఉన్నట్టుగా గమనించారు. ఇతనిపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఈ క్రమంలో జగదీశ్, ఇతనికి సహకరించిన కృపానందం ఇద్దరూ కర్నూల్ వస్తున్నారన్న సమాచారంతో ఇద్దరినీ మిస్టర్ ఇడ్లీ హోటల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
5 తులాల బంగారు ఆభరణాల రికవరీ…
నేరానికి వినియోగించిన కృపానందం పల్సర్ బైక్ సీజ్ చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలను నిందితుల నుంచి రికవరీ చేశారు. వారిని రిమాండ్కి తరలించారు. గతంలో ముద్దాని జగదీష్, విజయవాడ (Vijayawada) సీతార్ సెంటర్, కర్నూల్ లోని లక్ష్మీ టౌన్షిప్కు చెందిన ఎద్దుల కృపానందంపై 25కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. కృపానందం కర్నూల్ రెండవ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిసేవాడు. గత ఆగస్టు నెలలో ఓ దొంగతనం కేసులో సస్పెన్షన్ వేటుకు గురై అరెస్టయ్యాడు.
