TG | ముగిసిన జవాన్ నాగరాజ్ అంత్య‌క్రియలు… క‌న్నీటితో క‌డ‌సారి వీడ్కోలు

నర్సంపేట, మే 20 (ఆంధ్రప్రభ) : భారత సైన్యంలో మద్రాస్ 3 యూనిట్ లో నాయక్ గా పనిచేస్తూ జమ్ము కాశ్మీర్ లో నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు (28) అనే యువ సైనికుడు మృతి చెందడంతో వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు సంపంగి మల్లయ్య, విజయల కథనం ప్రకారం…. గత 16 నెలల క్రితం స్టేషన్ ఘనపూర్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన ఓర్సు సింధుజతో వివాహం జరిగింది. సెలవుల్లో ఉన్న నాగరాజుకు ఇటీవల పాకిస్తాన్ – భారతదేశానికి మధ్య యుద్ధం జరగనున్న దృష్ట్యా కాల్ రావడంతో జమ్ము కాశ్మీర్ కు వెళ్లిపోయాడు. యుద్ధం అనంతరం తన క్యాంపులో ఉన్న నాగరాజు తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్ఫైర్ కావడంతో మృతి చెందినట్లు తెలిపారు.

మృతి చెందిన నాగరాజు మృతదేహాన్ని జమ్ము నుండి హైదరాబాద్ కు తరలించి అక్కడి నుండి నర్సంపేటకు మంగళవారం ఉదయం తీసుకువచ్చారు. మృతదేహం వెంట జమ్ము కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్న ఇద్దరు భారత సైనికులు వరంగల్ నుండి ఆర్మీ అధికారులు తోడురాగా, మృతదేహాన్ని నాగరాజు భార్య సింధుజ సంతకం చేయడంతో వారికి మృతదేహాన్ని అప్పగించారు. పెళ్లి అయిన 16నెలలకే తన భర్త మరణించడం తనకు దిక్కులేనిదానినయ్యానని సింధుజ కన్నీరు మున్నీరుగా పిలపించారు. నాగరాజ్ అన్న వెంకటేష్ కూడా ఏడాది క్రితం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 12 నెలల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇరువురు మృతిచెందడం కుటుంబ సభ్యులను కలచివేసింది.

మృతుని అన్న సంపంగి సాయి కుమార్ మాట్లాడుతూ.. వడ్డెర కులంలో పుట్టిన తన తమ్ముడు భారతమాత రక్షణ కోసం సైనికుడిగా చేరి మరణించడం తమకెంతో గర్వకారణమని, తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతునికి పెళ్లయినప్పటికీ పిల్లలు లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. వడ్డెర కులంలో పుట్టి సైన్యంలో చేరిన నాగరాజు మృతిచెందడం తమ కులానికి ఎంతో గర్వకారణం అని నర్సంపేట మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి అన్నారు.

నాగరాజుకు నివాళులర్పించిన రాజకీయ నాయకులు:
భారత సైనికుడు జమ్మూ కాశ్మీర్ లో మృతిచెందిన సంఘటన తెలుసుకున్న నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతికాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, ఓర్సు తిరుపతి, అంజలి, భత్తిని రాజేందర్ లతో పాటు పార్టీ శ్రేణులు నివాళులర్పించారు.

నర్సంపేటలో ఊరేగింపు :
జమ్ము కాశ్మీర్ లో మృతిచెందిన సంపంగి నాగరాజు మృతదేహాన్ని భారీ వాహనంపై నర్సంపేట పట్టణంలో ఊరేగించి, హిందూ స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. నాగరాజ్ అమర్ రహే అంటూ పూర్తి లాంచనాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. భారత సైన్యంలో పనిచేస్తూ చనిపోయిన నాగరాజు శవయాత్రలో వందలాది మంది ప్రజలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మృతికి కారణాలు తెలియాల్సి ఉంది :
జమ్ము కాశ్మీర్ లోని క్యాంపులో ఉన్న నాగరాజు మృతి చెందినట్లు తమకు సమాచారం అందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజ్ తుపాకీ మిస్పైర్ తో చనిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *