హైదరాబాద్, ఆంధ్రప్రభ : సంక్షేమం అభివృద్ది రెండు కళ్లులా రాష్ట్ర బడ్జెట్ ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని, అన్ని రంగాలకు అన్ని వర్గాలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ 2025-26 రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాల సమున్నతికి అద్దం పట్టేవిధంగా ఉందని, విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక, మహిళా, రైతుల విభాగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రభుత్వం కేటాయించిన నిధులు రానున్న కాలంలో ఉత్తమ ఫలితాలను ఇవ్వనున్నాయి.
ట్రిలియన్ డాలర్ట ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా…
పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో ప్రధానమైన ఆరు గ్యారంటీలకు నిధులు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధుల రూపు కల్పించి చేతల ప్రభుత్వమని నిరూపించుకోవడం ప్రశంసనీయమన్నారు. అభివృద్ది పథకాలను ప్రజా సంక్షేమాన్ని సమతూకంగా పాటిస్తూ దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దళిత , బడుగు బలహీన వర్గాల ఆర్ధిక పురోగతికి మార్గదర్శనం చేసే ఈ బడ్జెట్లను శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , శాసనమండలిలో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టి సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు కాంగ్రెస్ నిబద్ధతను ప్రస్ఫుటిస్తుంది. ఈ తెలంగాణ బడ్జెట్ ప్రస్తుత, భవిష్యత్ తరాల ప్రగతికి ఉజ్వల బాట వేస్తుందని అన్నారు.