TG | కంచెగచ్చిబౌలి భూవివాదం.. సెబీకి హరీశ్ రావు ఫిర్యాదు !

  • నిబంధనల ఉల్లంఘనపై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్

హైదరాబాద్: కంచెగచ్చిబౌలిలోని వివాదాస్పద భూముల తాకట్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రముఖ ఆర్థిక నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఛైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా దాదాపు 400 ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి రూ.10,000 కోట్ల రుణం రుణం తీసుకున్నట్లు హరీష్ రావు సెబీ ఛైర్మన్‌కు రాసిన నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు.

ఈ భూములు తెలంగాణ అటవీ విభాగానికి చెందినవేనని, సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అటవీ భూమిగా గుర్తించిందని హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సైతం అటవీ భూములను ధ్వంసం చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలుశిక్షల అంశాన్ని ప్రస్తావించిందని గుర్తు చేశారు.

ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు

టీజీఐఐసీ వార్షిక ఆదాయం రూ.150 కోట్లకు మించని స్థితిలో ఉండి కూడా వేల కోట్ల అప్పులు చేయడం ఆర్థిక అవకతవకల నిదర్శనమని హరీశ్ రావు ఆరోపించారు. అంతేకాకుండా, ప్రైవేట్ సంస్థను పబ్లిక్ సంస్థగా మారుస్తూ పారదర్శకత లేకుండా వ్యవహరించారని అన్నారు. ఇలాంటి మార్పులపై సెబీ నిబంధనలు ఎలా పాటించబడ్డాయన్న విషయంపై సందేహాలు వ్యక్తం చేశారు.

పూర్తి స్థాయి విచారణకు డిమాండ్

భూమిని తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజ్‌ చెల్లించడాన్ని కూడా హరీశ్ రావు లేఖలో ప్రస్తావించారు. ఇది ఆర్థిక బాధ్యతల నిర్లక్ష్యం, ప్రజాధనంతో ఆటలాడటమేనని విమర్శించారు.

ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నిజాలను వెలికితీయాలని సెబీకి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. అటవీ భూములను తాకట్టు పెట్టడం, అక్రమంగా రుణాలు పొందడం, పారదర్శకత లేని మార్పులు—అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తుతో ప్రజలకు నిజాలు తెలియజేయాలని కోరారు.

Leave a Reply