TG | హాస్టళ్ల మెనూపై నివేదిక ఇవ్వండి – ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహల్లో విద్యార్థులకు అందిస్తున్న మెనూ వివరాలను రెండు వారాల్లో నివేదించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, పాఠశాలల భవనాల నిర్వహణ, వసతుల పై న్యాయవాది చిక్కడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ను సూచించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని వెల్లడించింది. తొమ్మిది వేలకు పైగా వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని తన వాదనలలో చిక్కుడు ప్రభాకర్ తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.