TG | ఇది బేడీల రాజ్యం – రేవంత్ స‌ర్కార్ పై హ‌రీశ్ రావు హాట్ కామెంట్స్

జిన్నారం, జూన్ 21 (ఆంధ్రప్రభ) : జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుబంధు నిధుల కోసం రైతుల ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పటాన్చెరువు (Patancheru) నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి రెండు లక్షల ఎకరాలకు రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. పటాన్చెరువు రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏతులకు పోయి పదికి పదిహేను ఇస్తాను అని కోతలు కోసిన ఏతుల రాయుడు నేడు రైతుబంధును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

ఆనాడు కెసిఆర్ (KCR) హయాంలో రైతులకు వరినాట్ల సమయంలో రైతుబంధును ఇస్తే నేడు ఓట్ల సమయంలో ఇచ్చే విధంగా రేవంత్ (Revanth) పాలన సాగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఎమ్మెల్యేల జీతాలను బందు చేసి రైతులకు సహాయం అందించిన ఘనత కేసీఆర్ ద‌ని గుర్తు చేశారు. నాడు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న కోతల ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసే లేదని గుర్తు చేశారు. రైతు చనిపోతే పది రోజుల్లో వారి కుటుంబానికి రైతు భీమా ద్వారా పది లక్షల రూపాయలు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. దేవుళ్ళపై ఒట్టు పెట్టి మాట తప్పిన ఘనత ఎగవేతల రాయుడు రేవంత్ దే అన్నారు. లగ‌చర్ల రైతుల భూముల హక్కులకై పోరాటం చేస్తే వారి చేతులకు బేడీలను వేసిన ఘనత ఎగవేత‌ల రేవంత్ కి దక్కిందన్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులకు బేడీలు వేసి రాష్ట్ర పరువును బజారులో వేసిన ఘనత రేవంత్ దేన‌ని, ఫీజు రీయంబ‌ర్స్ మెంట్, కరెంటు కోతలు, తులం బంగారం, మహిళలకు రూ.2500, వృద్ధులకు 4000 పింఛన్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కోతలే తప్ప చేసింది ఏమీ లేదన్నారు. హైడ్రా పేరుతో రాష్ట్రంలో అలజడి సృష్టించి రియల్ ఎస్టేట్ (Real estate) వ్యాపారాన్ని నేలకూల్చిన ఘనత ఆయనకే ద‌క్కుతుంద‌న్నారు. ఆనాడు ప్రతి గ్రామానికి వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను ఇచ్చిన ఘనత కెసిఆర్ ద‌ని గుర్తు చేశారు. నేడు ఇచ్చిన ట్రాక్టర్ కు డీజిల్ పోయలేని స్థితిలో గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయని, దీనికి కారణం రేవంత్ అసమర్థ పాల‌న‌ అన్నారు.

పాలన చేతకాక ప్రతిపక్షాలపై తన అక్కసును తీర్చుకోవడం సరైన పద్ధతి కాదని గుర్తు చేశారు. ప్రతిపక్షాలపై తప్పులను ఎత్తిచూపడం తప్ప పాలన సోయి లేకుండా గాడి తప్పుతుందని ఆయన అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం రైతులకు రైతుబంధును ఇచ్చేవరకు పోరాటం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. లేనియెడల కలెక్టరేట్, ఓఆర్ఆర్ ను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పోరాటం తమకేమీ కొత్త కాదని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తట్టుకునే దమ్ము ధైర్యం తమకు ఉందన్నారు. రేవంత్ పాలనలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, వెంకటేశం గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, సోమిరెడ్డి, అంజయ్య యాదవ్, కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, ప్రకాశం చారి, ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply