- రూ.200 కోట్లతో కాళేశ్వరం పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి
- ప్రకృతి ఆశీర్వాదంగా గోదావరి నది
- గోదావరి పుష్కరాల వరకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తా..
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పుష్కరాల లో పుణ్య స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు (గురువారం) సరస్వతి పుష్కరాలకు 4.12 నిమిషాలకు కాళేశ్వరం విచ్చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ సిటీని పరిశీలించారు.
జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేరిన 17 అడుగుల ఏక శిలా సరస్వతి మాతా విగ్రహాన్ని ఆవిష్కరించి సరస్వతి ఘాట్ ను ప్రజలకు అంకితం చేశారు. అనంతరం అంతర్వహిని సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని, శుభానందదేవిని, ప్రౌడ సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనతరం సరస్వతి ఘాట్ లో పుష్కరాలపై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా హయంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
రాష్ట్రంలో అయినా, దేశంలో అయిన నదులను పూజించడం మన సంస్కృతి, సంప్రదాయమని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందని, మంథని నియోజకవర్గానికి పెద్ద చరిత్ర ఉన్నదని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఆద్యుడు పివి నరసింహారావు మంథిని వాసి అన్నారు.
ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేసిన పీవీ నరసింహారావు మంథని బిడ్డ, తదుపరి శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించారని అన్నారు. శ్రీపాద రావు సభను ఎంతో హుందాగా నడిపించారని తెలిపారు. రాష్ట్రంలో లక్షల కోట్లు విదేశీ, స్వదేశీ పెట్టు బడులను పెట్టించడం, ప్రైవేట్ రంగంలో వేల కోట్ల పెట్టు బడులను తేవడం రాష్ట్రం అభివృద్ధిలో శ్రీధర్ బాబు కృషి చాలా గొప్పదని అన్నారు.
మంథని నియోజక వర్గ అభివృద్ధికి.నిరంతరం కష్ట పడే శ్రీధర్ బాబును ప్రజలే కాపాడు కోవాలన్నారు. ఆయన సేవలు రాష్ట్రం యావత్తు అవసరమని, ఆయన నియోజకవర్గ అభివృద్ధి కి తక్కువ సమయం కేటాయింపు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలని తెలిపారు.
శ్రీధర్ బాబు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయాలని మంత్రి కోరారని, కానీ రూ.100 కోట్లు కావాలని అడిగారని తాను రూ.200.కోట్లు ఇస్తానని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోనే కాళేశ్వరాన్ని గొప్పగా అభివృద్ధి చేయాడానికి వంద కాదు, రెండు వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను, సమ్మక్క సారాలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేస్తా అన్నారు.
మంథని నియోజక వర్గం ప్రజలు అదృష్టంగా గర్వంగా ఫీలయ్యే నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని, తప్పకుండా మంథని నియోజక వర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను, ఇతర శాఖల అధికారులను అభినందించారు.