తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “రైతు నేస్తం” కార్యక్రమంలో రైతుల ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ ఎంతో హృదయపూర్వకంగా మాట్లాడారు. రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని సీఎం అన్నారు.
ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతుల మద్దతే కీలకం అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో పదవులు అనుభవించిన వారు పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏమీ చేయకుండా, ఇప్పుడు వీధివీధి నాటకాలు వేస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు
గత ప్రభుత్వ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి వదిలేసినారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో వారు సృష్టించిన విధ్వంసం వందేళ్లకైనా కోలుకోవడం కష్టం అని అన్నారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించి ప్రజలను మభ్యపెట్టారని, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణ మాఫీ చేయలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని విమర్శించారు.
రైతులకు భరోసా ఇచ్చిన ప్రజా ప్రభుత్వం
గత ప్రభుత్వం “వరి వేస్తే ఉరే” అని బెదిరించింది; కానీ “వరి వేసుకోండి, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం” అని హామీ ఇచ్చిన ప్రజల ప్రభుత్వం మనది అని అన్నారు. పేదలకు సన్న బియ్యం అందించేందుకు, రైతులను సన్న బియ్యం పండించమని ప్రోత్సహించాము. రూ.500 బోనస్ ప్రకటించి, రాష్ట్రంలో 60 శాతం సన్న బియ్యం పండించగలిగాము. ఇది పేదలకు బియ్యం లభ్యతకు దోహదపడిందన్నారు. ఈ విధంగా తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని.. రైతుల కళ్లలో ఆనందాన్ని చూడటం ముఖ్యమంత్రిగా తనకు అత్యంత సంతృప్తికరమైన విషయమని ఆయన అన్నారు.
గత పాలనలో అప్పుల భారం
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై రూ. 8 లక్షల 20 వేల కోట్ల అప్పు మోపారని, దీనివల్ల నడుం వంగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వాళ్ళు ఇప్పుడు మనల్ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్కొక్కటిగా అన్ని సవాళ్లను అధిగమిస్తూ, రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
9 రోజుల్లో 9 వేల కోట్లు – రైతు భరోసా విజయవంతం
ఇన్ని కష్టాలు ఉన్నా, కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతులకు అందించే విధంగా “రైతు భరోసా” కార్యక్రమాన్ని ప్రారంభించాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వాసం. గత 18 నెలల్లోనే రైతుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదేనని గర్వంగా చెప్పారు.
గ్రామ సభలు – ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ
గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బతికే స్థితికి తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు మాత్రం చావులను రాజకీయానికి వాడుకుంటూ అధికారంలోకి రావాలనే దురాలోచనతో ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
“కొంత కాలమైనా సమయం ఇవ్వరా? సరిదిద్దుకునే అవకాశం ఇవ్వరా?” అని ప్రజలకు, విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకెళ్లి ఫోన్ ట్యాపింగ్ వరకు చేసిన దుర్వినియోగాన్ని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని అన్నారు.
ఉద్యోగ నియామకాలలో వేగం – రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు
ఏడాదిలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. “మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం” అని అన్నారు. రైతులకు సోలార్ పంపుసెట్లు, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై అవగాహన కల్పించేలా కలెక్టర్లకు సీఎం ఈ వేదిక నుంచే ఆదేశాలు జారీ చేశారు. రైతులు పంట మార్పిడి చేయాలని సూచించారు. భూమి రైతుకు ఆత్మగౌరవం, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎవరు ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా… వచ్చే పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుందని ధైర్యంగా చెప్పారు. చివరగా రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వారు ఇప్పుడు సిగ్గు లేకుండా మనల్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.