హైదరాబాద్ , ఆంధ్రప్రభ : గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లకు రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని.. అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ను రూ.7,300 కోట్లకు ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. గతంలో మద్యం దుకాణాల గడువుకు 3 నెలల ముందే దరఖాస్తులు తీసుకున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల వద్ద నాన్ రిఫండబుల్ ఫండ్ కింద రూ.2 వేల కోట్లు వేసూలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. భూములు గురించి హరీశ్ రావు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని అన్నారు. కోకాపేట భూములు వేలం వేసిన చరిత్ర ఎవరిదని మండిపడ్డారు. హరీశ్రావును ముందు పెట్టి మాట్లాడిస్తున్నారని.. ఆయన వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటూ మంత్రి కోమటి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హరీశ్రావూ… సభలో ఇన్ని అబద్ధాలా? కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్
పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో ఇన్ని అబద్ధాలు మాట్లాడుతారని అనుకోలేదని ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై మాట్లాడుతూ.. హరీశ్ రావు ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందని అన్నారు. పాలన అంటే ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదని అని మండిపడ్డారు. పరీక్ష పేపర్ల లీకేజీతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు పాలన అంటే అని సెటైర్లు వేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలను మీటింగ్లకు వాడుకోవడం తప్ప వారిని వృద్ధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేయలేదని అన్నారు. ఆర్టీసీ సిబ్బంది నిరసనలు తెలిపితే ఉద్యోగాలను తొలగించారని ఫైర్ అయ్యారు. పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలయ్యాయని అన్నారు. నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానపరిచారని కామెంట్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.400 లకే గ్యాస్ సిలిండర్ పంపణీ జరిగిందని గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం సిలిండర్ ధరను రూ.1,250 చేశామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని అన్నారు. కానీ, హరీశ్ రావు ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బాలూనాయక్ అన్నారు.