హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో స్టూడెంట్స్కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.
