హైదరాబాద్ – తెలంగాణాలో అన్నదాతల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.. నేడు కూడా సిరిసిల్లాలో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో గడిచిన 48 గంటలలో మొత్తం ఏడు గురు అన్నదాతలు ఊపిరి ఆగింది.. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఇప్పటివరకు చనిపోయిన రైతులు సంఖ్య 465 గా ఉంది. ఇది ఇలా ఉంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన జెల్ల దేవయ్య(51) సాగు నీరు సరిగ్గా రాక అప్పులు చెల్లించలేననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నేడు చోటు చేసుకుంది..
ఇక భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లెకు చెందిన మంద చంద్రయ్య 4 బోర్లు వేసి, పంట పెట్టుబడికి రు.14 లక్షల అప్పు చేయగా.. బోర్లు పడక, నీరు రాక పంట ఎండిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
కొత్తగూడెం జిల్లా కూసుమంచి మండలం తురకగూడేనికి చెందిన యువ రైతు బుర్ర దర్గయ్య(30) పంట సాగుకు అప్పులు తెచ్చి వాటిని తీర్చలేక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
నిర్మల్ జిల్లా భైంసా గ్రామానికి చెందిన హంపొలి ప్రభాకర్ రెడ్డి (42) అనే రైతు పంట పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక పొలంలోనే చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో యువ రైతు అరికాంతపు రాజు (38) రూ.14 లక్షలు పెట్టుబడి పెట్టగా, సరైన దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చలేనని ఉరి వేసుకొని బలవన్మరణం పొందాడు.
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటకు చెందిన యువ రైతు కడుదల విజేందర్ (36) పెట్టుబడి కోసం రూ.4 లక్షల అప్పు చేయగా, దిగుబడులు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఒత్తిడిని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్ పల్లికి చెందిన బుజ్రంపల్లి దుర్గయ్య(74) బ్యాంకులో పాత రుణం చెల్లిస్తే కొత్త రుణం ఇస్తామని అధికారులు చెప్పడంతో పాత బాకీ అంతా చెల్లించాడు. అయినా కూడా కొత్త రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు