Sports Hub | తిరుపతికి స్పోర్ట్స్ హబ్ సెంటర్..

Sports Hub | తిరుపతికి స్పోర్ట్స్ హబ్ సెంటర్..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : తిరుపతి నగరానికి జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతుల ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. తిరుపతిలో స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కోసం 28 ఎకరాల భూమిని దామినీడు వద్ద కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు.
తిరుపతిలో క్రీడా హబ్ ఏర్పాటు కొరకు గతంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వినతిపత్రం అందజేయడంతో పాటు, పలుమార్లు ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి శాప్ చైర్మన్ రవి నాయుడు తీసుకువెళ్లారు.
అంతేకాకుండా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ప్రతిపాదనలు తీసుకెళ్లడం జరిగింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తిరుపతి దామినేడు వద్ద స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో క్రీడాంధ్రప్రదేశ్ రూపకల్పనలో ఈ నిర్ణయం ఒక కీలక మైలురాయి కానుందని, తిరుపతి క్రీడా హబ్గా అభివృద్ధి చెందేందుకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణ భారతదేశానికి తిరుపతి రానున్న రోజుల్లో ప్రధాన క్రీడా కేంద్రంగా అవతరించనున్నదని శాప్ చైర్మన్ రవి నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
