హైదరాబాద్ – ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. . తమ హయాంలో ఎస్ఎల్బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, అయితే తన మిత్రుడి కూతురు పెళ్లి వేడుకకు వెళ్లానని చెప్పారు.. తాను ఫిబ్రవరి 21వ తేదీన దుబాయ్కి వెళితే 22 ఉదయం ఎస్ఎల్బీసీ ఘటన జరిగిందన్నారు.
అయినా ప్రభుత్వంలో ఉన్న మీరు రెస్క్యూ పనులు చేయాలి. కానీ మమ్ములను అంటే ఎలా? అని రేవంత్ ను నిలదీశారెు. గతంలో కూడా కాళేశ్వరం విషయంలో ఇలాగే మాట్లాడారని ఫైర్ అయ్యారు.. కాళేశ్వరంను తమకు అప్పగించండి చేసి చూపిస్తాం అంటే తోక ముడిచారని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా మీ వల్ల కాదు అంటే చెప్పండి.. మేము రెస్క్యూ చేసి చూపెడతాం. పది రోజులు అయినా డెడ్ బాడీలు ఇంకా బయటకు తీయలేదు. మృతదేహాలను బయటకు తీసిన తర్వాత కచ్చితంగా డీఎన్ఏ టెస్ట్లు నిర్వహించాలి. మేము వెళితే టన్నెల్ వరకు రానీయలేదు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు వెళితే మాత్రం దగ్గరుండి చూపించారు. ఎస్ఎల్బీసీ ఘటన విషయంలో ముఖ్యమంత్రికి సీరియస్నెస్ లేదు. అందుకే వనపర్తి రాజకీయ కార్యక్రమానికి వెళ్లి అక్కడ నుంచి ఎస్ఎల్బీసీ వెళ్లారు. ఈ విషయాలు అన్ని అసెంబ్లీలో ఎండగడతాం.’’ అని హరీశ్రావు తెలిపారు.
బాపూ … క్షమించండి..రేవంత్ ది కురచబుద్ది ..
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని హరీశ్ రావు విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ట, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధామని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని విమర్శించారు.
సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ముందు ఉన్న విగ్రహాన్ని చూసుకోవడం చేదకానీ బాపు ఘాట్ పునరుద్ధరిస్తామని బడాయి కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందన్నారు. నాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం.. నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధకరమని చెప్పారు. ఓ మహాత్మా మన్నించు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.