వేములవాడ : పేదల దేవుడిగా పేరుగాంచిన ఎములాడ రాజన్నకు భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించే కోడెలకు రక్షణ లేకుండా పోతుంది. భక్తులు సమర్పించిన కోడెలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో అభం శుభం ఎరుగని కోడెలు అకాల మరణం పొందుతున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గురువారం తిప్పాపూర్ గోశాలలో రెండు కోడెలు మృతి చెందిన విషయం మరవకముందే శుక్రవారం వేకువజామున అదే గోశాలలో మరో 8కోడెలు మృతి చెందినట్లు, ఈ కోడెలను ఆలయ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని వాగులో పూడ్చి పెట్టినట్లు తెలుస్తుంది.
దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించే రాజన్న కోడెలు పిట్టల్లా రాలుతున్న ప్పటికీ అధికారుల చర్యలు శూన్యంగా ఉన్నాయని, కోడె మొక్కులతో ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ఆలయానికి వస్తున్నా కోడెల పోషణ, ఆరోగ్యం విషయంలో అధికారులకు ఇంతటి నిర్లక్ష్యం ఉండరాదని, ఇప్పటికైనా కోడెల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజన్న భక్తులతో పాటు పట్టణ ప్రజలు కోరుతున్నారు.