Singapore Open 2025 | క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సాత్విక్ – చిరాగ్

  • ప్రణయ్, సింధు, త్రీసా-గాయత్రి ఔట్ !

సింగపూర్ : భారత స్టార్ డబుల్స్ జోడి సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ 2025 (BWF వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్) క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు.

ఈరోజు (గురువారం) జరిగిన ప్రీక్వార్టర్ మ్యాచ్‌లో ఇండోనేషియా ద్వ‌యం సబర్ కార్యమాన్ గుటామా – ముహమ్మద్ రెజా ఇస్ఫహానీ తో త‌ల‌ప‌డిన సాత్విక్ – చిరాగ్… 1 గంట 14 నిమిషాల పాటు జ‌రిగిన పోరులో 19-21, 21-16, 21-18 తేడాతో విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్ :

భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ పోరాటం లేకుండానే పరాజయం పాలయ్యాడు. అతను ఫ్రాన్స్ ఆటగాడు క్రిస్టో పోపోవ్ చేతిలో వ‌రుస సెట్ల‌లో 16-21, 14-21 తేడాతో 42 నిమిషాల్లో ఓడిపోయాడు.

మహిళల సింగిల్స్:

ఒలింపిక్ పతక విజేత పీ.వి. సింధు చైనీస్ స్టార్ చెన్ యుఫీను ఎదుర్కొని కష్టంగా పోరాడినప్పటికీ, 9-21, 21-18, 16-21 తేడాతో ఓడిపోయింది.

మహిళల డబుల్స్:

భారత యువ డబుల్స్ జంట త్రీసా జాలీ – గాయత్రి గోపీచంద్ చైనీస్ జోడీ జియా యిఫాన్ – జాంగ్ షూషియాన్ చేతిలో 8-21, 10-21 స్కోర్‌తో ఓడిపోయారు.

మరో డబుల్స్ మ్యాచ్‌లో అమృత ప్రముతేష్ – సోనాలి సింగ్ జంట, ఆస్ట్రేలియాకు చెందిన గ్రోన్యా సమర్విల్లే – అంజెలా యూ చేతిలో 21-23, 7-21 తేడాతో వెనుదిరిగారు.

మిక్స్‌డ్ డబుల్స్:

భారత మిక్స్‌డ్ జంట రోహన్ కపూర్ – రుత్వికా శివాని గడ్డె హాంకాంగ్ జోడీ టాంగ్ చున్ మాన్ – ట్సే యింగ్ సుయెట్ చేతిలో 10-21, 16-21తో పరాజయం పాలయ్యారు.

ఈ టోర్నీలో కేవలం సాత్విక్ – చిరాగ్ జంట మాత్రమే భారత్ తరఫున క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించి ఆశలు కొనసాగిస్తున్నారు. మిగతా క్రీడాకారులు అంతా ప్రీక్వార్టర్ దశలోనే నిష్క్రమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *