చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందాలను వెంటనే నిలిపి వేయాలని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) హుకుం జారీ చేశారు. చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం నియోజకవర్గంలోని ఇందారం చేరుకున్నారు.
మంత్రికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇందారం, రసూలపల్లి, జైపూర్, భీమారంలో కార్నర్ మీటింగ్ (Corner meeting) లో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకంతో మైనింగ్, కార్మిక మంత్రి పదవులను అప్పగించిందని, ఆ శాఖలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన ఇలాఖలో ఎలాంటి అక్రమ దందాలు సాగనివ్వనని ఇది తన హెచ్చరిక అని అన్నారు. ఎలాంటి అక్రమాలు జరిగినా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజాయితీగా పని చేస్తూ ప్రజలకు సేవకులుగా ఉందామని నాయకులకు పిలుపునిచ్చారు. తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన మంత్రికి నాయకులు కార్యకర్తలు, ఘనంగా స్వాగతిస్తూ భారీ బైక్ ర్యాలీ (Bike rally) నిర్వహించారు.