విజయవాడ, మార్చి 9 (ఆంధ్రప్రభ): ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు శాశ్వత ప్రాతిపదికన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆలయ అధికారులతో చర్చించి సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మ ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు..
సమీక్షలో ఆలయ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అధికారులు. టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు.. కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, చేపట్టబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు.. వివిధ పనులకు సంబంధించిన సాద్యాసాధ్యాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా అధికారులకు పలు సూచనలు చేశారు.
రాబోయే శతాబ్దం అవసరాలకు తగ్గట్లుగా దుర్గగుడి ఘాట్ రోడ్, శాశ్వత క్యూలైన్ల నిర్మాణం, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లు, తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడానికి వాటర్ ప్లాంట్ల ఏర్పాటు ఎస్కలేటర్ల నిర్మాణం వంటి విషయాలపై చర్చించారు.
వచ్చే విజయదశమి నాటికి మౌలిక సదుపాయలను మెరుగుపరచాలని కోరారు. భక్తులకు విశ్రాంతి గదులు, కాటేజీలు లాంటివి నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.. అన్ని శాఖల సమన్వయంతో మాస్టర్ ప్లాన్ ను పగడ్బంది గా రూపొందించాలని కోరారు
కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె వి ఎస్ ఆర్ కోటేశ్వరరావు, వైకుంఠేశ్వరరావు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ హెచ్ ఓ డి శ్రీనివాస్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు, టెక్నికల్ టీం సిబ్బంది బోరా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..