Revanth Reddy | నేడు రైతు భరోసా నిధుల విడుదల

Revanth Reddy | నేడు రైతు భరోసా నిధుల విడుదల
రేపు రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్లు జమ
తొలివిడతలో ఎకరం వరకు సాయం
మూడు విడతల్లో పెట్టుబడి అందజేత
Revanth Reddy | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ రైతులకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నేడు రేవంత్ సర్కార్ పంట పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను విడుదల చేయనుంది. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా నిధులను ఆదివారం సీఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో సాయంత్రం 4గంటలకు జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు.ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు రూ.9 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ఒక ఎకరం వరకు సాయం అందేలా రూ.3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరతాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమవుతాయి. ఇరవై రోజుల అనంతరం రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేస్తారు.
నేడు నర్మెటలో ఆయిల్పామ్ కర్మాగారం ప్రారంభోత్సవం..
నేడు నర్మెటకు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలో ఆయిల్పామ్ పంటకు కొత్త శకం ప్రారంభంకానుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ కర్మాగారం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ఆదివారం ప్రారంభంకానుంది. నర్మెట కర్మాగారం అందుబాటులోకి రానుండటంతో సిద్దిపేటతోపాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరగనుంది.
పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలో కొరత, డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం నర్మెటలో జరిగే రైతు ఉత్సవాల్లో కొత్త పంటలకు బోనస్పై విధాన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.
